అమరావతి జూన్ 03 : రాష్ట్ర ప్రభుత్వం,ఉర్దూ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన “ఉర్దూ ఆవోసికే” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అమరావతిలో బుధవారం ఘనంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయశాఖ,మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి జనాబ్ ఎన్.ఎం.డి. ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు జనాబ్ షరీఫ్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ హాజీ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ,వైస్ చైర్మన్ జనాబ్ పఠాన్ ఖాదర్ ఖాన్,బోర్డు డైరెక్టర్ జనాబ్ మహబూబ్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన వారిని మెమెంటోలతో సత్కరించారు. రాష్ట్రంలో 50 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకున్న ఉర్దూ అకాడమీ,ఉర్దూ భాషాభివృద్ధి,విద్యార్థుల ప్రోత్సాహం కోసం భవిష్యత్తులో మరిన్ని బృహత్తర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవంలో సుమారు 2,000 మంది విద్యార్థులు,ఉర్దూ భాషా మేధావులు,అధ్యాపకులు,సిబ్బంది,ప్రముఖులు పాల్గొన్నారు. ఉర్దూ భాష పరిరక్షణ,అభివృద్ధి,యువతలో ఉర్దూ పట్ల ఆసక్తి పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని పలువురు అభిప్రాయపడ్డారు.