కడప మనస్సాక్షి జూన్ 16:
జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో “నీట్” పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి , జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ డీఆర్వో మల్లికార్జునుడు సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 3,148 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో కడప పట్టణ పరిధిలో 2,386 మంది, ప్రొద్దుటూరు పరిధిలో 762 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 264 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రవేశం, బయోమెట్రిక్ ధృవీకరణ, భద్రతా తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, జామర్లు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.