కడప మనస్సాక్షి: నగర కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బీజేపీ-కూటమి కార్పొరేటర్ అభ్యర్థి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తల పవన్ కుమార్ (B.Tech) విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ‘మై విజన్ ఫర్ అవర్ డివిజన్’ ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, గెలిచిన రెండు నెలల్లోనే సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. రూ.2 లకే శుద్ధి చేసిన మినరల్ వాటర్ అందించే ప్లాంట్ ఏర్పాటు, నెలకు ఒకసారి ప్రజా సమస్యలపై ముఖాముఖి, ప్రతి మూడు నెలలకోసారి ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు పీఎం ఆవాస్ యోజన ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, నివాస స్థలాలు అందేలా పోరాటం చేస్తామని, పారిశుధ్య నిర్వహణతో పాటు యువతకు ఉపాధి, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరీ శంకర్, కృష్ణారెడ్డి, కంబగిరి, గంగాధర్, రమణారెడ్డి (టీడీపీ), రాము (టీడీపీ), కుల్లాయప్ప, నాగేశ్వర్ రెడ్డి, మావల్లి షేక్, కార్తీక్, కిషోర్, ముజాషీర్ తదితరులు పాల్గొన్నారు.