MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 11:39 am Posted by : State Buearo

శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు

చెన్నూరు : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో లోరిష బృంద నాట్య కళామందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన నెలరోజుల కూచిపూడి సమ్మర్ క్యాంపు ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రం ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వేషధారణలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు భారతీయ కళా వైభవాన్ని ప్రతిబింబించాయి. భక్తిరస, శృంగార, వీరరసాలతో కూడిన అభినయాలు, లయబద్ధమైన అడుగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య గురువు ఏ. వీరలక్ష్మి మాట్లాడుతూ, “అడుగుల్లో లయ… అభినయంలో భావం… అదే కూచిపూడి నృత్య వైభవం” అని అన్నారు. కూచిపూడి నృత్యం కేవలం కళ మాత్రమే కాదని, భావాలను వ్యక్తపరిచే దివ్య సాధనమని పేర్కొన్నారు. కళలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు. సమ్మర్ క్యాంపులో పాల్గొని ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కళకు వయసుతో సంబంధం లేదని, ప్రతిభకు గుర్తింపు లభించడమే గొప్ప విజయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కళా వికాసానికి విశేష కృషి చేస్తున్న ఏ. వీరలక్ష్మిని ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కళాభిమానులు అభినందించారు. “కళను ఆదరించే చేతులు ఉన్నంత కాలం సంస్కృతి సజీవంగా ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, భక్తులు, కళాభిమానులు పాల్గొని చిన్నారుల ప్రదర్శనలను అభినందించారు. కార్యక్రమం ముగింపులో అన్ని విద్యార్థులతో కలిసి జ్ఞాపక చిత్రాలు దిగారు.