MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:50 pm Posted by : State Buearo

9వ డివిజన్‌లో బీజేపీ ఇంటింటి ప్రచారం జోరు

-ఇంటింటికీ బత్తల పవన్ కుమార్

కడప (మనసాక్షి): కడప నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మంగళవారం సాయంత్రం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన వార్డు వీధుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలిసి కమలం గుర్తుకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ప్రచారంలో పాల్గొన్న పవన్ కుమార్‌కు వార్డు మహిళలు, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో పర్యటించిన ఆయన స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని మౌలిక వసతుల లేమిపై స్థానికులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బత్తల పవన్ కుమార్ మాట్లాడుతూ డివిజన్‌లో తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, గుంతలమయమైన రహదారులు, పారిశుధ్య లోపం తీవ్రంగా ఉన్నాయని మండిపడ్డారు. అధికారం ఉన్నా లేకపోయినా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ 9వ డివిజన్‌ను నగరంలోనే ఒక మోడల్ డివిజన్‌గా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి బత్తల పవన్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు “మార్పు కోసం ఓటు.. అభివృద్ధి కోసం ఓటు.. బత్తల పవన్ కుమార్‌కు ఓటు” అంటూ చేసిన నినాదాలు వీధుల్లో మార్మోగాయి.ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.