MANASSAKSHI
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 10:15 pm Posted by : State Buearo

NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్‌లో టెలిగ్రామ్‌ పై తాత్కాలిక నిషేధం

న్యూ ఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలలో అక్రమాలు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 22 వరకు యాప్ సేవల నిలిపివేత

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులో ఉండదని సమాచారం. ఈ ఆదేశాల తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను తొలగించగా, యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు.

మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ పై కూడా ఆంక్షలు

జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాత సందేశాలను సవరించి తప్పుడు ఆధారాలు సృష్టించే అవకాశాన్ని అడ్డుకోవడమే దీని ఉద్దేశమని అధికారులు తెలిపారు.

పేపర్ లీక్ ఆరోపణల పై చర్యలు

మే 2026లో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపుల ద్వారా చీటింగ్ ముఠాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఎన్టీఏ గుర్తించింది. కొన్ని ఛానెళ్లను తొలగించినప్పటికీ సమస్య కొనసాగడంతో, టెలిగ్రామ్‌పై దేశవ్యాప్త తాత్కాలిక నిషేధం విధించాలని ఎన్టీఏ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది.