చెన్నూరు, ఆగస్టు 28 మనస్సాక్షి: హాకీ మాంత్రికుడు, భారత క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న *‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’*కు వైఎస్సార్ కడప జిల్లాలోని చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైంది. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాల స్థాయిలో సాధించిన క్రీడా ప్రతిభను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఐదు పాఠశాలలను ఎంపిక చేస్తోంది. ఎస్జీఎఫ్లో పాఠశాల సాధించిన పాయింట్ల ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేసి క్రీడా ప్రతిభ పురస్కారాలతో సన్మానించనున్నారు. ఈ క్రమంలో జెడ్పీహెచ్ఎస్ రామనపల్లి పాఠశాల 211 పాయింట్లు సాధించి వైఎస్సార్ కడప జిల్లా నుంచి అవార్డుకు ఎంపికైంది. పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి సాధించిన పాయింట్లతో ఈ గుర్తింపు లభించింది. పాఠశాల క్రీడా విభాగం పీడీ పీ. గణేష్బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందిస్తూ క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆగస్టు 29న సాయంత్రం 3 గంటలకు కడపలోని డీఈఓ కార్యాలయ మీటింగ్ హాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులకు క్రీడా ప్రతిభ పురస్కారాన్ని అందజేయనున్నారు. పాఠశాలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించడం పట్ల ప్రధానోపాధ్యాయురాలు పి. ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
రామనపల్లి జెడ్పీహెచ్ఎస్కు ‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ అవార్డు
RELATED ARTICLES
