కలికిరి జూన్ 17(కడప మనస్సాక్షి ప్రతినిధి)
కలికిరిలోని జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల కళాశాలలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వై. సోమశేఖర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో లెక్చరర్లను నియమించనున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు కనీసం 55 శాతం మార్కులు, బీఎడ్ అర్హత కలిగిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
