– బి జె పి కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్
కడప మనస్సాక్షి: కడప మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారం ముమ్మరమైంది. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఇళ్లను సందర్శించి ప్రజలను కలుసుకుని వారి ఆశీర్వాదాలు, మద్దతు కోరారు. ప్రచారంలో భాగంగా స్థానికులతో పవన్ కుమార్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 9వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, మురుగునీటి కాలువల నిర్మాణం, పారిశుధ్యం, చెత్త నిర్వహణ వంటి మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని, డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పవన్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో డివిజన్కు చెందిన ప్రముఖ నాయకులు గౌరి శంకర్, గంగాధర్, కృష్ణారెడ్డి, మహబూబ్ వల్లి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ప్రచారంలో భాగస్వాములయ్యారు.9వ డివిజన్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగుతామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
