- మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని ప్రపంచాన్ని అందిద్దాం
తహసీల్దార్ విజయ్ కుమారి
చెన్నూరు మనస్సాక్షి:- ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని తహసీల్దార్ విజయ కుమారి పులిపినిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆమె మండలంలోని రామనపల్లెలో విలేజ్ క్లినిక్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె తెలిపారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని రక్షించవచ్చని ఆమె అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి రోజు పాటించాల్సిన బాధ్యతగా భావించాలని తద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గురువేశ్వరరావు, టిడిపి నాయకులు అక్బర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
